Type In English Convert to Telugu
హనుమజ్జయంతి
Wednesday
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.
ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.
ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను. అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.
ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో "సానపట్టిన వజ్రము" వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.
కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే!
యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.
శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి ఆశ్టొత్తరంతొ విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా,వంటి పారాయణలు గావించాలి.
మూలం: పండుగలు పర్వదినాలు, ఆదిపూడి వేంకట శివ సాయిరామ్.
పూర్తి వ్యాసం కొరకు
శ్రీ నృసింహ జయంతి
శ్రీ నృసింహ జయంతి
సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభీ కరుణానిధేమామ్|
ప్రహ్లాద భేద పరిహార పరవతార లక్ష్నీనృసింహ మమదేహి కరావలంబమ్||
సంసార కూప మతిఘోర మగాధమూలం సప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య|
దీనస్యదేవ కృపాయ శరణాగతస్య లక్షీనృసింహ మమదేహి కరావలంబమ్||
అవి తొలుత ఆలా! శ్రీ నృసింహస్వామివారిని ప్రార్థించి ఆ స్వామి వారి ఆవిర్భావమునకు గల కారణాలు ఏమిటో? ఒక్కసారి మననంచేసుకుందాం! ఈ భూమిపై 'మానవుడు ' అవతరించిన నాటినుండి తనమనుగడకు ఆనందం కలిగించేవాటిని, తనలు అమ్మి వ్ధాలమేలును చేకూర్చే ప్రకృతి సంప్స్దకు "దేవతా స్వరూఅపాలు కల్పించి" వాటిని పూజిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాము. అలా మానవుడు ఈ సృష్టిలోని చరాచరములను అన్నింటిని పూజ్త్యభావముతో చూడటం ఒక విశేషం! అంతేకాదు మన భారతీయ సంస్కృతిలో చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, కొన, నది, పర్వతాలు ఇలా ప్రకృతిలోని సంపదనూన్నిటిని పదిలపరుచుకునేందుకు తగు చర్యలు తీసుకుంటూ ఉండటం మరోవిశేషం. అందువల్లనే మన భారతదేశము కర్మభూమిగా పేరుగాంచినది. అట్టి భారతీయుల ప్రబలమైన విశ్వాసము నకు ప్రామాణికమైనది ఈ న్ర్సింహస్వామి ఆవిర్భావచరిత్ర.. పూర్వం వైకుంఠపురిని ద్వారపాలకులైన 'జయ విజయులూ సంరక్షించుచూ ఉండు సమయాన, ఒక్కసారి సనక, సనందన, సనత్కుమార సనత్సజాతులైన బ్రహ్మమానసపుత్రులు వైకుంఠవాసుని దర్శనార్థమై వస్తారు. వారు వచ్చినది శ్రీమహావిష్ణువు ఏకాంత సమయం అగుటవల్ల, శ్రీహరి దర్శనానికి వారిని అనుమతించక అడ్డగిస్తారు. దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు వారి ఇరువురును శ్రీ మహా విష్ణువునకు విరోధులై మూడు జన్మలపాటు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తారు. అలా శాపగ్రస్తులైన వారు ఇరువురు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యాకశిపులుగా రెండవ జన్మలో రావణ, కుంభకఋణులుగా మూదవ జన్మలో శిశుపాల, దంతవక్త్రులుగా జన్మిస్తారు. అలా మొదటి జన్మలో దితి, కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మింస్చి ఘోరమైన తపస్సులుచేసి, ఆ వరగర్వంతో లోకకంటకులైనారు. దానితో దుష్టశిక్షా, శిష్టరక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిలో వరాహావార రూపంలో హిరణ్యక్షుని ఆటలు కట్టించి హిరణ్యాక్షుని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు.
తన సోదర సంహారముపై మిక్కిలి ఆగ్రహించిన 'హిరణ్యకశిపుడు ' బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సుచేసి దానవ పరిజ్ఞానముతో వివిధ రీతుల మరణము లేకుండ వరాలుపొంది. తనకు ఒక ఏవిధముగాను మరణమే లేదు అను వరగర్వముతో ఎన్నో అకృత్యాలు చేస్తూ విర్రవీగిపోతూ ఉంటాడు. అట్టి దానవ శ్రేష్ఠునకు నలుగురి కుమారులలో పెద్దకుమారుడైన "ప్రహ్లాదుడు" విష్ణుభక్తుడై తండ్రి అగ్రహానికి గురైనా, హరి నామస్మరణ వీడదు. దానితో వానిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. అక్కడ గురుకులాల్లో కూడా తోటి బాలురకు "హరినామ మాధుర్యాన్ని" పంచిపెడుతూ వారిచే కూడా హరికీర్తనలు పాడించేవాడు. చివరకు హరినామస్మరణ వీడమని సామ, దాన, భేద, దండోపాయాలతో ప్రయత్నిస్తారు. అందువల్ల కూడా ఏ ప్రయోజనము పొందలేకపోతాడు. చివరకు పుత్రవాత్సల్యమనేది లేకుండ "ప్రహ్లాదుని" సంహరించుటకు వివిధ మార్గాలు అవలంబిస్తాడు. ప్రహ్లాదుని ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో నిన్ను అనుక్షణము కాపాడుచున్న శ్రీహరి ఏక్కడరా? ఈ స్తంభమునందు చూపగలవా? అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రహ్లదుదు తండ్రీ! సర్వాంతర్యామి అయినా శ్రీహరి "ఇందుగలడందులేడను సందేహములేదు" ఎందెందు వెదకిన అందందే కలడు అని జవాబు ఇస్తాడు. అయితే ఈ స్తంభమునందు చూపగలవా? అని ఆగ్రహంతో తనచేతిలో ఉన్న గదతో ఒక్క ఉదుటన స్థంబాన్ని గట్టిగా కొడతాడు.
అంత శ్రీహరి 'హిరణ్యకసిపుడు ' తన దానవ పరిజ్ఞానుతో 'బ్రహ్మా వలన పొందిన వరాలు ఎమిటో? వాటిలోని లోపాలు క్షణకాలం అలోచించి, అంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమునందుగాని, దిక్కులలోగాని, రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని, వెలుతురుగాని, నీటిజంతువులు, క్రూరమైన అడవిజంతువులవల్లగాని, సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని, మనుషులవల్లగాని, అస్త్రశస్త్రాలవల్లగాని, ఇంటగాని, బయతగాని, చావులేకుండా పొందిన వరాలకు అనుగుణమైన రూపుదాల్చి హరిణ్యకశివుడు మొదిన స్తంభమునుండి తన అవతారాలలో 'నాలుగవ అవతారం' "శాశ్వత అవతారం" అంటే! నిర్యాణము పొందిన రాముడు. కృష్ణుడువంటి అవతారముల వలెకాకుండా! సద్యోజాతుడై అంటే అప్పటి కప్పుడు అవతరించినవాడు మిగిలిన అవతారములలోవలే తల్లి దండ్రులతో నిమిత్తములేకుండా! స్వచ్చందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ "నృసింహ అవతారము" శాశ్వతమైనదిగా చెప్పబడినది. అలా ఈ శ్రీ నృసింహస్వామివారు వైశాఖ శుక్లపక్షములో పూర్ణిమకు ముందువచ్చే 'చతుర్దశి ' నాడు ఆఆవిర్భవించారు. ఆపుణ్యదినమునే మనం "శ్రీనృసింహ జయంతి" గా జరుపుకుంటూ ఉంటాము. ఇది క్తయుగంలో వచ్చిన పరిశుద్ధావతారం.
"వైశాఖ శుక్ల పక్షేతు చతుర్థశ్యాం సమాచరేత్ ,
మజ్జన్మ సంభవం వ్రతం పాపప్రణాశనం"
అని సాక్షాత్తు శ్రీహరి స్వ్యంగా ప్రహ్లాదునితో చెప్పినట్లు "నృసింహపురాణం"లో చెప్పబడినది. ఆవిధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన (సర్వాంతర్యయామి) అనిపలుకులకు ప్రామాణికంగా హిరణ్యకశివుడు మోదిన స్తంభము ఫెళఫెళమని విరగిపడుచుండగా భూనభోంతరాలన్ని దద్దరిల్లేలా సింహగర్జనతో ప్రళగర్జన చేస్తూ! ఉగ్రనరసింహ రూపంతో ఆవిర్భవిస్తాడు. అట్టి స్వామి ఆకారంచూస్తే సింహంతల, మానవశరీరం. సగం మృగత్వం, సగం నరత్వం. ఇంకా ఆమూర్తిలో క్రౌర్యం, కరుణ, ఉగ్రత్వం, ప్రసన్నత ఆవిధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నృసింహస్వామి. అలా ఆవిర్భవించిన ఆ స్వామి "హిరణ్యకశివుదు" పొందిన వరాలను చేదించకలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము "గడపపైన" మృగ నరలక్షణాలతో గూడి, ఒక్క ఉదుటన హిరణ్యజశిపుని మెడపట్టి తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవముకాని గోళ్ళతో హిరణ్యకశిపుని ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు.
అనంతరము ఆ ఉగ్రనరసింహమూర్తిని దేవతలు ఎవ్వరు శాంతింప చేయలేక, దేవతలందరు ప్రహ్లాదుని ఆ స్వామిని శాంతింప చేయమని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మీ సమేతుడై భక్తులకు ప్రత్యక్షమౌతాడు. అట్టి స్వామి నిర్యాణములేని అవతారమూర్తిగా, పిలిస్తే పలికేదైవంలా భక్తుల పాలిట కల్పతరువుగా కొనియాబడచూ పూజించబడుచున్నారు.
పూర్తి వ్యాసం కొరకు
శంకర జయంతి
శంకర జయంతి
భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞకరణే
అనే శ్లోకాలు మన చెవికి తాకినంతనే వెంటనే మనకు జ్ఞప్తికి వచ్చేది శ్రీశంకరభగవత్పాదులే! మానవులకు భక్తి, జ్ఞాన, కర్మలద్వారా మానవజీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తికి మార్గము చూపిన మార్గదర్శకులు శ్రీశంకర భగవత్పాదులే. వీరిబాట మానవులకు మంగళకరం మరియు అత్యంత జయప్రదం. అట్టి వీరి 'జన్మదినం' హిందూ జాతికంతటికి మరపురాని మహాపవిత్రమైన పుణ్యదినం.
పూర్వం కేరళ రాష్ట్రమందు "శివగురువు - ఆర్యాంబ" అనువారు కాలడి అనే ఒక చిన్ని గ్రామములో జీవిస్తూ ఉండేవారుట! వారు ఇరువురు భగవంతునిపై ఎంతో భక్తి భావము ఉంచి ఎన్ని నోములు నోచిన, ఎన్ని వ్రతాలు చేసిన ఆ పుణ్య దంపతులకు "సంతానభాగ్యము" మాత్రము కలుగలేదుట! ఆ దంపతులు 'తిరుచునాపల్లి ' చేరి అచ్చటగల వృషభాచలేశ్వరుని దర్శించి సేవించినారు. ఒకనాడు శివగురువునకు భగవానుడు కలలో కనిపించి "మీకు తక్కువ కాలము జీవించు జ్ఞానవంతుడు కావలెనా? లేక అయోగ్యుడైన ఎక్కువకాలము జీవించు కుమారుడు కావలెనా? వీటిలో ఏ వరం కావాలో కోరుకోమంటాడు అంత శివగురువు ఆలోచించి దీర్ఘాయువు కలిగిన అయోగ్యుడైన కుమారుని వల్ల ఏమి ప్రయోజనము? "పుత్రోత్సాహము తండ్రికి" అనునటుల, మాకు యోగ్యుడైన కుమారుని ప్రసాదించమని శివగురువు కోరుకుంటాడు. ఆ వర ప్రభావముతో కొలది కాలానికి ఆర్యాంబ గర్భం దాల్చి "వైశాఖశుద్ధ పంచమి"నాడు దివ్యతేజోకాంతులతో విరాజిల్లే పుత్రుని కన్నదట! ఆ పుత్రుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వానికి 'శంకరుడు అనిపేరు పెట్టుకున్నారు. "శంకరోతి ఇతి శంకరః" అంటే మానవులకు సర్వశుభాలకు, సర్వ సంపదలకు, సర్వవిద్యలకు మూలాధారమైనవాడు అని అర్థము. ఆలాగునే ఆ బాలుడు శుక్లపక్షచంద్రునిలో కళలు రోజురోజుకు అభివృద్ధిచెందునట్లు, పువ్వుపుట్టగానే పరిమళాలను వెదజల్లుతున్నట్లు ఆ పిల్లవాడు 'మూడవసంవత్సరం' బాల్యమందే సమస్తవిద్యలు చదువుట వ్రాయుట నేర్చుకున్నాడట.
ఇలా ఉండగా వృద్ధుడవుతున్న 'శివగురువు' తన కుమారునకు ఏడవ ఏట ఉపనయన సంస్కారములు చేయాలను కోరికతోనే ఆకస్మికమరణం పొందినాడు. అంత ఆ వైధవ్యము పొందిన 'ఆర్యాంబ' తమతోటి బంధువుల సహాయమును అర్థించి కుమారునకు ఉపయనయ సంస్కారము చేయిస్తుంది. అనంతరం శంకరులకు ఎనిమిదవ సంవత్సరము వచ్చుసరికి సర్వశాస్త్ర పండితుడు, సర్వశక్తి వంతుడు అవుతాడు. అందులకు తార్కాణంగా!
తన మాతృమూర్తి వృద్ధాప్యముతో బాధపడుచు ఎండనక, వానఅనక, సుదూర ప్రాంతమందుగల నదికి స్నానానికి నిత్యము వెళుతూ ఉండేది. ఆ తల్లి పడుతున్న బాధకు కలతచెంది ఎలా అయినాసరే? ఆ తల్లి బాధను తొలగించాలని తలచి "గంగాస్తవం" చేయగా ఆ నదీమతల్లి ప్రసన్నురాలై తన ప్రవాహమార్గాన్ని మరలించుకుని ఆచార్యులవారి గృహమునకు అత్యంత సమీపంగా ప్రవహించ సాగిందట! అది వారికి గల మాతృభక్తికి, వారికి గల దివ్యశక్తికి కేవలం మచ్చుతునక మాత్రమే!
ఆ తల్లి 'ఆర్యంబ' కుమారుని మాతృభక్తికి ఎంతో సంతసిస్తూ సుమారునికి యుక్తవయస్సు వస్తోందని గమనించి కుమారునకు వివాహ ప్రయత్నాలు చేయసాగింది. కాని శంకరులకు సన్యాస దీక్ష వహించాలని కోరిక! అట్టి వివేక వైరాగ్యములతో మనసంతా నింపుకునియున్నారు. కాని తల్లికి ఏ మాత్రము మనస్సుకు కష్టము కలుగుకుండా జ్ఞానబోధతో ఒప్పించి సన్యాసదీక్ష తీసుకుంటారు. ఎంతైనా మాతృమూర్తికి గల పుత్రవాత్సల్యం వెలకట్టగలమా చెప్పండి ఆ తల్లి మనోవేదన గ్రహించిన శంకరుడు మాతా! నీవు ఏ మాత్రము చింతించవలదు. నీ అవసానదశలో కేవలం నన్ను స్మరించినంతనే నీముందుండి నీకు తృప్తిగా సర్వకర్మలను నెరవేర్చగలనని చెప్పెను. ఆ ఇచ్చిన మాటప్రకారం ఆమె అవసాన కాలమందు కుమారా శంకరా! అని తలవగానే ప్రత్యక్షమయి, జరామరణ భారంతోనున్న తల్లికి సర్వలోక సుఖప్రదమైన "శుద్ధనిర్గుణ " తత్వాన్ని బోధించుటకు ప్రయత్నిస్తారు. కాని తల్లి వారి మాటలు అర్థంచేసుకునే స్థితిలో లేదు. దానితో మాతృభక్తి పరాయణుడైన శంకరుడు ఇలా పరమేశ్వరుని ప్రార్ధిస్తారు.
"అనాద్యంత మాద్యం పరంతత్వమర్ధం చిదాకార మేకం తురీయం త్వమేయం
హరిబ్రహ్మ మృగ్యం పరబ్రహ్మరూపం మనోవాగతీతం మహాశైవమీడే"
అని శంకరులు స్తుతించగా! ఆ మహాదేవాది దేవుడు 'పరమేశ్వరుడు' ప్రత్యక్ష భాగ్యముతో తల్లికి సద్గతి కలిగించి మాతృభక్తిని నిరూపించుకున్నారు.
ఒకసారి శంకరులు గురుకుల విద్యాభ్యాస సమయమందు ఒక బ్రాహ్మణుని ఇంట భిక్షను అర్థిస్తారు. ఆ ఇంటి ఇల్లాలు కడుదారిద్ర్య బాధను అనుభవిస్తూ, నాయనా! మావద్ద ఈ ఎండిన ఉసిరికాయ తప్ప మరి ఏదియును లేదు అని వాని భిక్షపాత్రలో వైచి కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగింది. ఆ దంపతుల దీనావస్థకు కలతచెందిన శంకరులు "శ్రీమహాలక్ష్మిని" సోత్రము చేసి ప్రసన్నము చేసికొని వారి దారిద్ర్య బాధను తొలగిస్తారు. ఆ స్తోత్రమే "శ్రీకనకధారాస్తోత్రమ్" అట్టి స్తోత్రమును 'మానవాళికి' అందించి వారి ఈతి బాధలను తొలగించుటకు మార్గము చూపిన 'కరుణామూర్తి' శ్రీశంకరాచార్యులవారు. వారు ప్రార్థించిన శ్రీ మహాలక్ష్మి కేవలం ఐశ్వర్యానికే ప్రధానం కాదుట! మానవులు కోరుకునే జ్ఞానము, సౌందర్యము, శక్తి మున్నగు సర్వ అభీష్టాలను ప్రసాదించే దేవతామూర్తియట!
"శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమో స్తు రమణీయ గుణార్ధవాయై
శక్యై నమో స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో స్తు పురుషోత్తమ వల్లభాయై"
అంటే 'శృతి ' అంటే వేదం. అదేజ్ఞాన సంపదకు మూలాధారమైనది. 'రతి' సౌందర్యం అనే అర్థాన్ని ఇస్తుంది. 'శక్తి ' కదలిక లేక మనోవాంఛా బలం కలుగచేస్తుంది. 'పుష్టి ' అంటే! మానవులు ఆశించే మనోరధములు అన్నియు ఈయగల వరప్రదాయని అని ఆ శ్లోకార్థాన్ని వివరించి చెప్పుకోవచ్చు.
ఒకసారి శంకరాచార్యులువారు నర్మదా నదీతీరాన తపోదీక్షలోనున్న గోవింద భగవత్పాదులను కలిసినప్పుడు వారు అడిగిన ప్రశ్నలకు 'దశశ్లోకి' ద్వారా జవాబు చెప్పగా, వారువారిని తనప్రియ శిష్యునిగా అంగీకరించి వారు రచించిన 'బ్రహ్మసూత్రములకు ' వ్యాఖ్య వ్రాయమని కోరినారుట! ఆ విధంగా కాశీపురమందు బ్రహ్మ సూత్రములకు భాష్యము వ్రాసియున్నారు. ఆ సమయమందు చెప్పినదే 'మనీషాపంచకము'.
ఇలా ఉండగా ఒకరోజు వ్యాసభగవానులు శంకరాచార్యులవారిని పరీక్షించదలచి వృద్ధబ్రాహ్మణ వేషముతో బ్రహ్మసూత్రముపై ఒక సందేహము వెలిబుచ్చినారుట! దానికి శంకరాచార్యులవారు వారి సందేహము సంతృప్తికరంగా తీర్చుటచే వారు ఎంతగానో సంతసించి మరో 16 సంవత్సరము ఆయుర్ధాయమును ప్రసాదించి అద్వైత మత ప్రచారము చేయవలెనని కోరినారుట! దానితో శ్రీ శంకరభగవత్పాదులు దేశము నలుమూలలా శంకరమఠములు ఏర్పరచి సనాతన సంప్రదాయ ప్రచారము విస్తృతముగావించుచూ! తుంగభద్రానదీ తీరమున 'శారదానిలయము' నందు తాను స్వయముగా చెక్కిన "శ్రీచక్రరాజముపై" శారదా పీఠము ప్రతిష్ఠించి, వారు కైలాసమునుండి తెచ్చుకున్న ఐదుస్పటిక లింగాలను ప్రతిష్ఠించినారు.
అలాగునే శంకరులవారు తన అద్వైత మత సిద్ధాంత ప్రచారముతో శృంగేరి, ద్వారక, గోవర్థన, జ్యోతిర్మఠము అను నాలుగు పీఠాలను నిర్మించి, దేశము నలుమూలలా ఎన్నో దేవాలయములందు దేవి, దేవతలను ఎన్నో స్తోత్రములతో గానము చేస్తూ! వారిని పూజించి సేవిస్తూ మానవులందరిని భక్తి, జ్ఞాన, కర్మల ద్వారా అద్వైత మార్గాభిముఖులుగా త్రిప్పి, మోక్షమార్గాన్ని చూపిన జగద్గురువులు శ్రీ శంకరభగవత్పాదులు.
అటువంటి పుణ్యమూర్తి జన్మదినమున మన మంతా విశేషంగా జరుపుకుని పునీతులౌదాముType rest of the Post here
పూర్తి వ్యాసం కొరకు
అక్షయ తృతీయ
అక్షయ తృతీయ
ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము. ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా
తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ, మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి. అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు. ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు, ఉపవాసాలు, పండుగలు అన్నవి. వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి. అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ-ఉగాది" పర్వదినం.
"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"
కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి. కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందురు. ఈనాడే "బదరీనారాయణ" మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషీకేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును. ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు చిన్నికృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులు, శనగలు వాయనమిచ్చి సత్కరించెదరు.
ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హొమ, దానాదులన్నియు "అక్షయము" పొందునుగాన! ఇది "అక్షయతృతీయ" మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు.
ఇందులకొక పురాణగాధకలదు. పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా; సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు "వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము" అని చెప్పగా విని, ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను. అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట. "అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.
"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"
వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని, పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు. అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.
మూలం: పండుగలు పర్వదినాలు, ఆదిపూడి వేంకట శివ సాయిరామ్.
పూర్తి వ్యాసం కొరకు
శ్రీరామనవమి
శ్రీరామనవమి
దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.
'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని'
కనుగొనుచుండవలెను.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా... ఎంతోరుచిరా... మరి ఎంతో రుచిరా... అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు 'రామనామ స్మరణ' మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట!
శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.
పూర్తి వ్యాసం కొరకు
ఉగాది
ఉగాది 
శ్లోకం
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగది పచ్చడిని తీసుకోవాలి.
'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును 'ఉగాది' అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభ మవడం వల్ల ఆరోజునుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.
తృట్యైనమః, నిమేషాయనమః, కాలాయనమః అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము. ఉగాదినాటి పంచాంగం పూజ, పంచాంగం పూజ, పంచాంగం శ్రవణం కాలస్వరూపనామార్చనకు ప్రతీకం. పంచాంగ పూజ, దేవి పూజ సదృశమైంది. అంతం, ముసలితనం, మరణం లేనిది కాలస్వరూపం. అదే దేవి స్వరూపం. అందుకే పంచాంగం పూజ, పంచాంగ శ్రవణం, దేవి పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది. విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధపాడ్యమి. ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది.
శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి, యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు, శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచిచెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు. ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం.
ఈ పండగ ప్రత్యేకత' ఉగది పచ్చడి' ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు. ఆరోగ్యానికి ఇది మంచిది. అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.
మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.
మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60 సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.
పూర్తి వ్యాసం కొరకు
పండుగలు
పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తాయి, విశదీకరిస్తాయి, నిలువరింపజేస్తాయి. నెలల వారిగా పండుగలను ఇక్కడ ఇస్తున్నాము. ఎప్పటికైనా ఈ పండుగలన్నిటికీ చక్కటి వివరాలను జత కలిపి అందరి ముందు వుంచాలన్నది మా అకాంక్ష. ఒక్కో పండుగకు కొంచెం కొంచెంగా వివరములను చేరుస్తున్నాము.
1. చైత్ర మాసము
ఉగాది
శ్రీరామనవమి
2. వైశాఖ మాసము
అక్షయ తృతీయ
శంకర జయంతి
నృసింహ జయంతి
హనుమజ్జయంతి
కూర్మ జయంతి
పరశురామ జయంతి
శ్రీ వీరబ్రహ్మేందస్వామి ఆరాధన
3. జ్యేష్ట మాసము
ఏరువాక పూర్ణిమ
4. ఆషాఢ మాసము
కుమార షష్ఠి
తొలి ఏకాదశి
గురుపౌర్ణమి
చాతుర్మాస్యదీక్ష
5. శ్రావణ మాసము
మంగళగౌరీ వ్రతం
రాఖీ పండుగ
వరలక్ష్మి వ్రతం
కృష్ణాష్టమి
6. భాద్రపద మాసము
వరాహజయంతి
కల్కి జయంతి
వినాయక చవితి
వామన జయంతి
అనంతపద్మనాభ చతుర్దశి
ఉండ్రాళ్ళ తద్ది
ఋషి పంచమి
మహాలయ పక్షము-ప్రాశస్త్యం
7. ఆశ్వయుజ మాసము
దేవీ నవరాత్రులు
దుర్గాష్టమి
మహర్నవమి
దసరా/విజయదశమి
అట్లతద్దె
శ్రీ సాయి పుణ్యతిధి
నరక చతుర్ధశి
దీపావళి
8. కార్తీక మాసము
నాగుల చవితి
కార్తీక పౌర్ణమి
తులసీ పూజ
కేదారేశ్వర వ్రతము
9. మార్గశిర మాసము
సుబ్రహ్మణ్య షష్ఠి
దత్తాత్రేయ స్వామి జయంతి
నూతన సంవత్సర వేడుకలు
భోగి - సంక్రాంతి - కనుమ
అయ్యప్ప - మకరజ్యోతి
10. పుష్యమాసము
త్యాగరాజ ఆరాధన
ముక్కోటి ఏకాదశి
బుద్ధ జయంతి
11. మాఘ మాసము
సరస్వతి జయంతి
రథసప్తమి
భీష్మఏకాదశి
మహాశివరాత్రి
12. ఫాల్గుణ మాసము
రామకృష్ణ పరమహంస జయంతి
ఇంగ్లీషు తేదీల ప్రకారం జరుపుకునే కొన్ని పండుగలు:
గణతంత్ర దినోత్సవం - జనవరి 26
మథర్స్ డే - మే 13
స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15
ఉపాధ్యాయుల దినోత్సవం - సెప్టెంబర్ 5
గాంధీ జయంతి - అక్టోబర్ 2
ఆంధ్ర రాష్ట్ర అవతరణ - నవంబర్ 1
బాలల దినోత్సవం - నవంబర్ 14
క్రిస్మస్ - డిసెంబర్ 25
ఇతర క్యాలండర్ల ప్రకారం నిర్ధిష్టమైన తేదీని అనుసరించని పండుగలు:
రంజాన్
గుడ్ ఫ్రైడే
బక్రీద్
మొహర్రం
ఈ పండుగల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత అవగాహన వుంటుంది. మీకు తెలిసిన విషయాలను మాకు తెలియజేసే శ్రమ తీసుకోగలిగితే మా ఈ ప్రయత్నానికి చేయూతనిచ్చిన వారవుతారు. మేము ముందుగానే ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము.
పూర్తి వ్యాసం కొరకు






